Wednesday, September 7, 2011

ఉద్యమం

చాలా సంవత్సరాల క్రితం ఒక గురుకుల పాఠశాల.
ఆ బడిలో పిల్లలందరూ నిజంగా ఆణిముత్యాలు. ఐదో తరగతిలోనూ, ఏడో తరగతిలోనూ అద్భుత ప్రతిభ కనబరచిన పిల్లలు. ప్రభుత్వం ఇలాంటి గొప్ప బడులను వాళ్లకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పిల్లలకోసం చాలా వసతుల్ని కల్పించింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు వాళ్లకు మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పేవాళ్లు.
అక్కడ పని చేసే తెలుగు అయ్యవార్లకు తెలుగంటే నిజంగా ప్రేమ ఉండేది.
సైన్సు టీచరుగారికి నిజంగా విజ్ఞాన శాస్త్రం అంటే అభిమానమూ, శాస్త్రీయ దృక్పథమూ ఉండేవి.
సాంఘిక శాస్త్రపు అయ్యవారికి సమాజం గురించి తనదైన అవగాహన ఒకటి ఉండేది.
హెడ్మాస్టారు గారికి పిల్లలంటే అభిమానమూ, తన బాధ్యతపట్ల నిబద్ధతా ఉండేవి.
అయితేనేమి, ఒకసారి పిల్లలు తినే అన్నంలో పురుగులు కనబడ్డాయి.
చురుకైన పిల్లలు ఆ విషయాన్ని వెంటనే టీచర్ల దృష్టికి తెచ్చారు. టీచర్లు హెడ్మాస్టరుగారికి చెప్పారు.
మరునాడూ పురుగులు కనబడ్డాయి.
పిల్లలకు గొప్ప సామాజిక స్పృహ అలవడింది ఆ సరికి. పురుగుల్ని చూసిన కొందరు పిల్లలకు చాలా కోపం వచ్చేసింది. మిగతావాళ్లను కూడగట్టుకున్నారు. హెడ్మాస్టరుగారిని నిలదీద్దామని వెళ్ళారు.
రోజూ పిల్లలు, టీచర్లు అందరూ కలిసి భోంచేస్తుంటారు బడిలో. ఆరోజున, పాపం, ఆయన తన గదికే అన్నం తెప్పించుకొని తింటున్నారు.
తెలివైన పిల్ల నేతల మెదళ్లు చకచకా పనిచేశాయి- "మాకేమో పురుగుల అన్నం, మీకేమో ప్రత్యేక భోజనమా?" అని. పాపం, హెడ్మాస్టరుగారు తింటున్నది ప్రత్యేక భోజనమేమీకాదు, నిజానికి. పనిలో పడి, సమయానికి భోజనశాలకు రాలేక, అక్కడికే తెప్పించుకున్నారు, ఆ రోజుకు.
అంతే- పిల్లల నిరసన మొదలయిపోయింది. తరగతుల్ని బహిష్కరించేశారు. పిల్లలందరూ చెట్ల క్రిందికి చేరారు. పిల్ల నాయకులు గట్టిగా మాట్లాడారు. "ఈ దోపిడిని, అన్యాయాన్ని ఉపేక్షించకూడదు" అన్నారు. పిల్లలందరూ ఒక్కటై తలలూపారు. టీచర్లు ఏం చెప్పినా, హెడ్మాస్టరుగారు ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మని పరిస్థితి. సభలు, సమావేశాలు- ఎక్కడ చూసినా గందరగోళం- వేరువేరు కూటములు- అందరూ ఎక్కడెక్కడ ఏ ఏ అన్యాయాలు జరుగుతున్నాయో ఉన్నవాటినీ, లేనివాటినీ ఎత్తిపోశారు.
"ఇలాంటి పిల్లలకు మేం పాఠాలు చెప్పలేం" అన్నారు టీచర్లు. "నేనిక్కడ ఉండలేను" అని నొచ్చుకున్నారు హెడ్మాస్టరుగారు. చివరికి బడి మూసేశారు- పదిహేను రోజులు శలవలు ప్రకటించారు.
పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బడి తెరిచారు- ఈసారి కొత్త హెడ్మాస్టరుగారు, కొత్త టీచర్లు వచ్చారు.
పిల్లలు కొందరు ఒకింత ఉత్సాహపడ్డారు- "విద్యార్థి ఐక్యతతో ఏదైనా సాధించవచ్చు" అని చెప్పుకున్నారు పైకి.
కానీ పిల్లలవి నిజంగా సున్నిత హృదయాలు. "మేం హెడ్మాస్టరుగారిపైనా, ఉపాధ్యాయులపైనా చేసిన ఆరోపణల్లో పూర్తి నిజం లేదు. నిరసనైతే ప్రకటించాం, కానీ మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి మనసుల్ని మాత్రం చాలా గాయపరచాం" అని వాళ్ళు గుర్తించారు. అయినా గాయపడిన పెద్దల మనసుల్ని ఎలా చక్కదిద్దాలో తెలీక, వాళ్ళూ నొచ్చుకొని ఊరుకున్నారు!

అన్యాయాన్ని నిరసించాలి. అయితే ఆ క్రమంలో సత్యాన్ని వక్రీకరించనక్కర్లేదు. అసత్యాన్ని ప్రోత్సహించకూడదు. సూటిగా, నిజాన్ని మాత్రమే వ్యక్తీకరించటం అవసరం. ఇది ఈనాటి రాజకీయాలకే కాదు; అన్ని సామాజిక ఉద్యమాలకూ చాలా అవసరం- ఏమంటారు?

1 comment:

రమేష్! said...

నారాయణ గారు మీ రచన చాల బావుంది !

కానీ ఉద్యమం వరకు వచ్చింది అంటే నిజం (సత్యం) నీ గుర్తిన్చనప్పుడే కదా! ఉద్యమంలో బావోద్వుగాలు ఎప్పుడు బాగమే, అందువలనా అది ఎదుటివారకి మరియు ఉద్యమకారులకి కొంత బాధ మిగులుస్తుంది...
రమేష్!