Thursday, September 24, 2009

మురికి వాళ్లకు రెండు

రామారావు, సరళ రైలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. రైల్వేస్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నది. రైలు వచ్చి ఆగగానే, ఉన్న రెండు జెనరల్ బోగీల్లోకి దూరేందుకూ జనాలు పోటీపడి కొట్టుకోవటం మొదలెట్టారు.

రామారావు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది- S1లో. S1బోగీ జెనరల్ బోగీని ఆనుకొనే ఉన్నది. అయితే దేవుని దయవల్ల, దాన్నీ, దీన్నీ వేరుచేస్తూ మధ్యలో గోడలున్నై. ఆ గోడలు లేకపోతే వీళ్లూ, వాళ్లూ కలిసిపోవాల్సి వచ్చేది. వందలాదిమంది జనాలు అలాగే గనక దాడి చేస్తే S1 ఇక S1గా ఉండేది కాదు. అదీ జెనరల్ బోగీ అయిపోయేది- ఆపైన S2కూడా...

"చూడండి, అలగా జనం ఎలా కొట్టుకుంటున్నారో?" అంది సరళ. "పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలదాకా పోదంటారు-అందుకే. వాళ్లని మనతోటి మర్యాదస్తులతో పోల్చి చూడండి. మనం క్యూలో నిలబడి వరసగా ఎక్కమూ? వీళ్లూ అసలు మనుషులేనా అనిపిస్తుంది. లేకపోతే ఈ నెట్టుకోవటం ఏంటీ, క్రింద-పైన పడటాలేంటి? చినిగిపోయి, కంపుగొట్టే ఆ చొక్కాలేంటి, కిటికీల్లోంచి లోపలికి పిల్లల్ని దూకించటం ఏంటి? ఇది రైలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారసలు?"

అంతలో వాళ్లలోంచి ఓ తరంగం లేచి వచ్చి, అప్పుడే రైలెక్కబోతున్న సరళ చేతిని తాకింది! ఓ పిల్లాడు బాణంలా దూసుకొచ్చి ఆమెచేతివేళ్ళకు తగిలాడు.

"కళ్లు కనబడటం లేదూ? ఛీ, ఫో " విదిలించిందామె. చేతి వేళ్ళు ఆ పిల్లాడి జుట్టుకు తగిలాయి- మడ్డి మడ్డిగా, బంక బంకగా ఉన్నది జుట్టు. "తల స్నానం చేసి సంవత్సరం దాటి ఉండాలి. ఛీ, పాడు మనుషులు. స్వచ్ఛత ఎరుగని ముఖాలు. శుచి, శుభ్రత లేనే లేవు" ఆలోచనల్లో ఉండగానే రామారావు S1లోకెక్కి సరళకు చేయందించాడు. ఇద్దరూ తమ సీట్లలో కూలబడ్డారు.

సరళ చేతివేళ్ళు ఇంకా జిడ్డు జిడ్డుగా, అసహ్యంగా తోస్తున్నాయి. ఆ చేతిని ఒక ప్రక్కకు పెట్టుకొని కూర్చుందిగానీ, ముళ్ళమీద ఉన్నట్లే ఉంది. 'సబ్బెక్కడుందో, ఏమో? బయల్దేరే హడావిడిలో సబ్బు ఎక్కడ పెట్టింది, తను?'

"ఈ సీటు మాదండి" ఒకాయన వచ్చి నిలబడ్డాడు సరళకెదురుగా. "ఎంతండీ? మావి పంతొమ్మిదీ, ఇరవై. మీదెన్నో నెంబరు?" అన్నాడు రామారావు సమరసంగా. "ఇరవై నాది. లేవండి" అన్నాడా పెద్దమనిషి, కొంచెం పదునుగా. "ఎలా అవుతుందండీ? మావి రెండు సీట్లుంటేనూ?" అన్నాడు రామారావు తార్కికంగా, తన జేబులోంచి టికెట్ తీస్తూ. "నాకు తెలీదు- నాది ఇరవై. అంతే" అని ఆయన వచ్చి సరళను ప్రక్కకు నెట్టి కూర్చున్నాడు. సరళ కుంచించుకు పోయింది.

"మీ టిక్కెట్టు చూపించండి. ఈ సీటు మీదో, మాదో చూస్తాను." అన్నాడు రామారావు.

"మీకెందుకు చూపాలి? మీరేమన్నా రైల్వే అధికారులా? నేను చూపించక్కర్లేదు" అన్నాడు పెద్దాయన.

గొడవ మొదలైంది. చిలికి చిలికి గాలివానైంది. చివరికది తుఫానయ్యాకగానీ టీటీసి గారు ప్రత్యక్షం కాలేదు. వచ్చి చూసేసరికి, పెద్దమనిషి ఎక్కాల్సిన రైలు ఆ రోజుది కాదు; అంతకు ముందు రోజుది! పెద్దాయన తనను తాను తిట్టుకోలేక, రైల్వేవాళ్లను తిడుతూ, బోగీ దిగిపోయాడు. అంతలో రైలు కదిలింది.

"అందరూ చూడటానికి మనుషులేనండీ, కానీ గుణాలెలాఉంటాయో చూడండి" అన్నాడు సరళకెదురుగా కూర్చున్న కళ్లజోడు కుర్రాడు- చూపులు తలుపువైపు తిప్పుకుని. తలుపుదగ్గర నిలబడి ఉన్నాడొక మురికి పిల్లవాడు-జిడ్డు తలవాడు- బయటికి చూస్తూ. రైలు బయలుదేరగానే, జెనరల్ బోగీలో చోటు అందక, ఇక్కడ ఎక్కినట్లున్నాడు. నల్లగా, గ్రీజు మరకలతో మురికితేలుతున్న చొక్కా. ఆ చొక్కాలో వాడిలాంటి కుర్రవాళ్ళు ఇద్దరు దూరచ్చు.

సరళ కూడా వెనక్కి తిరిగి చూసింది తలుపువైపు. ఆ మురికివాడు- 'అంతకు ముందు తనను తాకింది వాడేనా?- మరి వాడిప్పుడు నావైపే ఎందుకు చూస్తున్నాడు?' గబుక్కున తల వెనక్కి తిప్పుకున్నది. ఎదురుగా కూర్చున్న కళ్ళజోడు కుర్రవాడు నవ్వి, అన్నాడు- " వీళ్లింతేనండీ, టిక్కెట్లుండవు. మాచెడ్డ రోగులండీ, మన దేశానికి పట్టిన చీడ పురుగులు. వికారపు బుద్ధులు. టిక్కెట్లుంటే మాత్రం ఏంటండీ, జెనరల్ వాళ్లు స్లీపర్లోకి ఎక్కకూడదండీ, చట్టప్రకారం. అయినా ఎక్కుతారంతే. ఈ టీటీసీలూ వాళ్లను చూసీ చూడనట్లు పోతుంటారు. నాకేమో వాళ్ళను చూస్తే వాంతికొచ్చినట్లౌతుంటుంది. మన దేశంలో ఎయిడ్సు పెరగటానికి కారణం వీళ్లేనండీ, మళ్ళీ మాట్లాడితే దేశంలో ఎనభై శాతం మేమేనంటారు."

అందరూ అంగీకరిస్తున్నట్లు తలలూపారు. సరళ అభినందిస్తున్నట్లు చూసింది కళ్లజోడతన్ని. ఆపైన వాళ్ళంతా భారతదేశాన్ని అభివృద్ధిచేయటం గురించి మాట్లాడుకున్నారు, అలసి నిద్ర వచ్చేంతవరకూ.

రాత్రై అందరూ పడుకున్నారు గానీ సరళకు నిద్ర రాలేదు.. తలుపు దగ్గర ఆ మురికి పిల్లవాడుఇంకా కూర్చునే ఉన్నాడు- తనవైపే చూస్తూ. "వీడు ఇక్కడే ఉన్నాడు ఇంకా. ఎవరిని ఏంచేస్తాడో? సామాన్లు ఏమైనా ఎత్తుకుపోడు గద! తన గొంతుకోస్తాడేమో, రాత్రి ?!"

అనుకున్నట్లే జరిగింది. ఏదో పేరులేని స్టేషన్లో రైలు ఆగి ఉన్నది. సరళకు అప్పుడే కునుకు పడుతున్నది. అంతలో ఒక చెయ్యి ముందుకొచ్చి, మొరటుగా ఆమె మెడలోని గొలుసును లాక్కున్నది. ఒక్కక్షణకాలం పాటు సరళకు నోట మాట పెగలలేదు. ఆ సరికి దొంగ ఆమె నగను లాక్కొని, బయటికి పరుగెత్తాడు. "దొంగ! దొంగ! పట్టుకోండి! నా గొలుసు!" అని సరళ అరిచేసరికి అందరూ మేలుకొని లైట్లు వేశారు.

ఆ సరికి బయట ప్లాట్ ఫారంపైన చీకట్లో దొమ్మీ జరుగుతున్నది. మురికి పిల్లవాడూ, కళ్ళజోడు కుర్రాడూ ఒకళ్లమీద ఒకళ్ళు పడి కొట్టుకుంటున్నారు. సరళ బ్యాగులు రెండూ వాళ్ల ప్రక్కన పడి ఉన్నై.

"పట్టుకోండి, దొంగ వెధవని. నా నగల్నీ, సామాన్లనీ ఎత్తుకుపోతున్నాడు"- అని కేకలు పెడుతూ సరళ బయట పెనుగులాడుతున్న మురికి పిల్లాడిమీదికి దూకింది, రుద్రమదేవిలా.

ఆ తర్వాతేమైందో ఆమెకు తెలీలేదు: కళ్లజోడు కుర్రవాడి పిడికిలి సూటిగా వచ్చి సరళ ముక్కుకు తాకింది. రామారావు పరుగెత్తుకొస్తున్నాడింకా. సరళకు తలతిరిగింది. కళ్ళు బైర్లు కమ్మాయి.

కళ్ళు తెరిచేసరికి తనూ, రామారావూ రైల్లో ఉన్నారు. రైలు ముందుకు పోతున్నది. ముక్కుకు పట్టీతో, తన తల రామారావు వొళ్ళో ఉన్నది. "ఏమండీ, నేను ముందునుండీ చెప్తూనే ఉన్నాను గదండీ; ఆ అలగావాడు మన బోగీలోకి ఎక్కినప్పుడే నాకు వాడి ఉద్దేశం అర్థమైంది. వాళ్ళ జాతి ఇంతేనండీ. నా నగలూ, మన సామాన్లూ అన్నీ ఎత్తుకుపోయాడు చూశారా? నాగతి ఇలాగైంది. మీకేమీ కాలేదుగద!" అని మూలిగింది సరళ.

"ఏమీ కాలేదు సరళా! మన సామానంతా మనకు దొరికింది. వాడెవడోగానీ, దేవుడిలా అడ్డం వచ్చాడు. లేకపోతే ఆ దొంగ వెధవ పూర్తిగా ఉడాయించేవాడే. ఆ తరువాత నేను వందరూపాయలిస్తే, "వద్దండీ" అని, తీసుకోకుండానే వాడు పోయి జెనరల్ బోగీ ఎక్కాడు" అని రామారావు చెబుతుంటే, ఎవరిగురించో అర్థం కాని సరళ బిక్కముగం వేసింది.

"చూడటానికి కళ్ళజోడు పెట్టుకొని టింగురంగామంటూ ఎంత బాగున్నాడో చూడు, ఈ దొంగ వెధవ! వాడి వేషం చూసి మనలాంటివాడే అనుకున్నాంగదా, మనం అందరం? వాడిట్లా దొంగతనాలు చేస్తుంటాడని మనకేం తెల్సు? ఆ మురికి పిల్లాడిలో ఉన్నంత మర్యాద వీడిలో లేకపోయింది చూడు!" అన్నాడు రామారావు సరళ తల నిమురుతూ.

రైలు పోతూనే ఉంది ఇంకా- మురికి వాళ్ళనీ, మర్యాదస్తుల్నీ మోసుకొని.

మురికివాళ్లకోసం రెండు బోగీలు. మర్యాదస్తులకోసం పదహారు.

Thursday, September 3, 2009

పద్యం

ఈ మధ్య "తెలుగు పద్యం" బ్లాగును చూశాను. మళ్ళీ నా చిన్నతనం గుర్తుకొచ్చింది. చిన్నతనంలో నేను, మా నాన్న పోటీగా తెలుగులో సొంత పద్యాలు చెప్పుకునేవాళ్ళం. ఆ తరువాత నేను గద్యాన్ని- అందులోనూ మామూలు జనాలు మాట్లాడుకునే వచనాన్ని- అలా అలా చిన్నపిల్లలు ఇష్టపడే కథల్ని- ఇష్టపడటం మొదలుపెట్టాను. 'తెలుగు పద్యం' ద్వారా భైరవభట్లగారు నాకు పద్యాలంటే మళ్ళీ ఓసారి అభిమానం పుట్టించారు. వారికి ధన్యవాదాలతో, ఈ చిన్న పద్యసుమం..

ఉ. ఉల్లమునందు భావనలు తుమ్మెదలై విరితావిగోరి పై
దేలగ, వాని యాకలిని దీర్పగనెంచిన పల్కుబోడి ప్రా-
ల్మాలెడి నొక్కతోట కథలై, యొకచో కవితా సుమంబులై
అల్లన పద్యమై యొక వనంబున తేనియలూరు గద్యమై.


చాలారోజుల తరువాత రాయబూనటంతో అన్నీ మర్చిపోయాను-- నాకోసం ఛందస్సుకు సంబంధించి ఈ చిన్న నోట్సు తయారు చేసుకున్నాను. ఎవరికైనా ఉపకరిస్తుందేమోనని ఇక్కడే జతపరుస్తున్నాను:


గణాలను గుర్తించేందుకు ప్రధాన సూత్రం: యమాతారాజభానసలగా
సూర్య గణాలు: గల, న
ఇంద్ర గణాలు: నల, నగ, సల, భ,ర, త.



కంద పద్యం:

౧. నాలుగు పాదాలు. మొదటి రెండూ ఒక భాగం; తర్వాతి రెండూ ఒక భాగం.
౨. ఒక్కో భాగంలోను మొదటి పాదంలో మూడు గణాలుంటాయి; రెండో పాదంలో ఐదు గణాలు- మొత్తం ఒక్కో భాగంలోను ఎనిమిది గణాలు.
౩. 'నల, గగ, భ, జ, స' అనే గణాలు మాత్రమే ఉండాలి. అంటే ప్రతి గణంలోను నాలుగు మాత్రలు ఉంటై.
౪. ఆరవ గణం 'నల'కానీ, 'జ' కానీ అయిఉండాలి.
౫. బేసి గణం 'జ' కాకూడదు.
౬. రెండు, నాలుగు పాదాల్లో ఒకటి-నాలుగు గణాల మొదటి పాదాలకు యతి మైత్రి ఉండాలి.
౭. ప్రాస మైత్రి ఉండాలి.


కందానికి ఉదాహరణలు:

'కందము చెప్పక కవిగా
డందము చందమును కంద పదమే యనగా..'

'తనయుల నజాత పక్షుల
ననల శీఖాభీతి చంచలాత్ముల నెటయుం
జననేరని బాలకులను
జననియు వీక్షించి శోక సంతాపితయై'

తేటగీతి

'సూర్యుడొక్కడుండు- సురరాజులిద్దరు- ఇన గణ ద్వయంబు తేటగీతి'

౧. నాలుగు పాదాలు.
౨. ప్రతి పాదంలోను వరసగా ఒక సూర్య గణం, రెండింద్రగణాలు, రెండు సూర్య గణాలు- మొత్తం అయిదు గణాలుంటాయి.
౩. మొదటి గణం మొదటి అక్షరానికి, నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి.
౪. ప్రాస నియమం లేదు.
౫. ప్రాసయతి చెల్లుతుంది.

తేటగీతి కి ఉదాహరణ:

"బిలము సొచ్చితిమేని నందెలుక చంపు
నింద యుండితిమేని దా నేర్చునగ్ని
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలన శిఖల
గ్రాగి పుణ్యలోకంబుల గాంతుమేము."

ఆటవెలది:

"ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు ఆటవెలది"

౧. పై సూత్రంతో ఒకటి-రెండు పాదాలు తయారౌతాయి. అలాగే మూడు-నాలుగు పాదాలున్నూ.
౨. మొదటి పాదంలోను, మూడవ పాదంలోను మూడు సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు ఉంటాయి. ఇక రెండవ పాదంలోను, నాల్గవ పాదంలోను వరసగా అయిదేసి సూర్యగణాలుంటాయి.
౩. అన్నిపాదాలలోను ఒకటవ, నాల్గవ పాదాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది.
౪. ప్రాస నియమం లేదు.
౫. ప్రాస యతి చెల్లుతుంది.

ఆటవెలదికి ఉదాహరణ:

అన్ని వేమన పద్యాలు-
"మేడి పండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ."


సీసము:

౧. నాలుగు పెద్ద పెద్ద పాదాలు: ప్రతి పాదంలోను ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు ఉంటై.
౨. ఒక్కో పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి- రెండు ముక్కలుగా రాయాలి.
౩. ఒక్కో ముక్కలోను మొదటి గణపు తొలి అక్షరానికి, మూడోగణపు తొలి అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౪. ప్రాసయతి పరవాలేదు.
౫. ప్రాయ ఉండనవసరం లేదు.
౬. సీస పద్యం తరవాత దానికి తోడుగా ఆటవెలదిగాని, తేటగీతిగాని ఉండటం తప్పనిసరి.

సీస పద్యానికి ఉదాహరణ:

"ఇరులు కోకిలములై నెచ్చోట కూయునో
అచ్చోట మధుమాసమవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
అవ్వేళ ల వసంతమందగించు
ఇరులేమయూరమై ఎటనాట్యమాడునో
అటనే నవాషాఢమావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆరోజు కార్తికమ్మాగమించు"



ఉత్పలమాల:
"భరనభభరలగ"

౧. నాలుగు ఒకేలాంటి పాదాలు. ప్రతి పాదంలోను వరస గణాలు 'భరనభభరలగ' వస్తాయి. అలా ఒక్కో పాదానికి మొత్తం ఇరవై అక్షరాలు వస్తాయి.
౨. మొదటి అక్షరానికి, పదవ అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౩. ప్రాస మైత్రి ఉండాలి.

ఉత్పలమాలకు ఉదాహరణ:

"కానుగ చెట్ల నీడననొకానొక స్వప్నపు సెజ్జ మీద ని-
ద్రాణత హాయిగొల్పగ సదా శయనింపగ నీ మహాంధకా-
రాన మనస్సు శాంతిగొనె- రాను భవత్కమనీయ కాంతి సౌ
ధానికి- నన్ను బిల్వకుము తన్వి- విభావిభవాభిరామవై."


చంపకమాల:
"నజభజజజర"

౧. నాలుగు పాదాలూ ఒకే రకంవి: "నజభజజజర" అలా ఒక్కో పాదంలోను ఇరవైఒక్క అక్షరాలు వస్తాయి.
౨. ప్రతిపాదంలోను మొదటి అక్షరానికి, పదకొండవ అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౩. ప్రాస మైత్రి ఉండాలి.

చంపక మాలకు ఉదాహరణ:

"పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కు, కఠోరవాక్యముల్
పలుకడొకానొకప్పుడవి పల్కిన కీడును కాదు; నిక్కమే!-
చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు, వేగిరమె శీతల నీరముగాక ? భాస్కరా!"


శార్దూలము:

"మసజసతతగ"

౧. నాలుగు ఒకేరకం పాదాలు. "మసజసతతగ". అలా ఒక్కో పాదంలోను మొత్తం పంథొమ్మిది అక్షరాలు ఉంటాయి.
౨. ప్రతి పాదంలోను మొదటి అక్షరానికి, పదమూడవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.
౩. ప్రాస ఉంటుంది.

శార్దూలానికి ఉదాహరణ:

"ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి, సు-
శ్లోకంబైన హిమాద్రినుండి భువి; భూలోకంబునందుండి య-
స్తోకాంబోధి; పయోధినుండి పవనాంధోలోకమున్ జేరె గం-
గా కూలంకష; పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్."


మత్తేభము:

"సభరనమయలగ"

౧. నాలుగు ఒకే రకమైన పాదాలు: "సభరనమయలగ". అలా ఒక్కో పాదంలోను మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి.
౨. మొదటి అక్షరానికి , పధ్నాలుగో అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.
౩. ప్రాస మైత్రి ఉంటుంది.

మత్తేభానికి ఉదాహరణ:

"ఇది కల్పాంతమొ ఇమ్మహోగ్ర సలిలంబేకార్ణవాకారమై
పొదలంజూచెనొ ఇంతతోన జగముల్ పోజేసెనో ధాత- యె
య్యది దిక్కెక్కడ సొత్తుమెవ్విధమునన్ బ్రాణంబు రక్షించుకో
లొదవున్ దైవమ యంచు గోపనివహంబుద్వేగమొందెన్మదిన్."

ఇవికాక మరిన్ని మళ్లీ ఇంకోసారి ఎప్పుడైనా.

వనమాల

రెండువేల ఐదు వందల సంవత్సరాల క్రితం- గౌతమ బుద్ధుడు తాను కనుగొన్న సత్యాలను ప్రజలందరితోటీ పంచుకుంటున్న సమయం- అప్పుడాయన విదిశా నగరపు ఆవలనున్న మామిడితోపులో విడిది చేసి ఉన్నాడు. బుద్ధుడితోసహా భిక్షువులందరూ భిక్షాపాత్రలు చేతబట్టుకొని, ప్రతిరోజూ ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్ళేవాళ్లు- భిక్షనర్ధించేందుకు.

ఒకనాడు బుద్ధుడు నగరపు వీధుల్లో నడుస్తుండగా ఆయన ప్రక్కనే ఒక రథం ఆగింది. దానినుండి సుందరమైన స్త్రీ ఒకామె దిగి, బుద్ధుని దగ్గరకు నడచుకొని వచ్చింది. మల్లెపూల మాలను చేబూనిన ఆ సుందరి, బుద్ధుని ముందు నిలచి, ఆయన మెడలో పూమాల వేసి వరించనెంచింది! బుద్ధుడు ఆమెను వారించాడు. "ఇది సరైన సమయం కాదు అమ్మాయీ! ప్రస్తుతం నేను భిక్షాపాత్రని ధరించి ఉన్నాను గద! ఈ మాలనే నువ్వు గనక నాకు రేపు ఉదయం, నేనుండే మామిడితోపుకు తెచ్చి ఇచ్చావంటే, అప్పుడు నేను దీన్ని సంతోషంగా స్వీకరించగలను" అన్నాడు. ఆమె సరేనని వెనుతిరిగింది.

ఆమె పేరు వనమాల. విదిశా నగరంలో పేరుగాంచిన, సంపన్న వేశ్య ఆమె. తన నాట్యగానాదులతో ఆమె నగరంలోని ధనిక విటులను తన దివ్యభవనంలోనే నిర్మించుకున్న సుందర సభా ప్రాంగణంలో రంజింపజేసేది. వ్యక్తిగత సంబంధాల పరంగా ఆ నగరపు ధనిక యువకులకు ఆమె తనదైన శిక్షణ నిచ్చేదికూడానూ. ఆమె నేర్పు, ఆమె అందచందాలను గురించిన ఖ్యాతి ఆరోజుల్లో ఆ ప్రాంతం అంతటా వ్యాపించి ఉండేది. ఆమె వెళ్ళిన తరువాత బుద్ధుని అనుయాయి ఒకరు ఆయనకు ఈ సంగతులు తెలియజేశారు.

మరునాడు తెల్లవారుతుండగానే వనమాల బుద్ధుని విడిదిని చేరుకున్నది. వయ్యారంగా ఆ మల్లెపూమాలను బుద్ధునికి సమర్పించింది. బుద్ధుడు సగౌరవంగా దానిని స్వీకరిస్తూనే "అమ్మాయీ! నువ్వు గమనించినట్లు లేదు- ఈ మల్లెలు వాడిపోయాయి. వీటి సువాసన కూడా పోయింది. నువ్వు నిన్న నాకు ఇవ్వబోయినప్పుడున్నట్లు లేవు, ఇవి ఇప్పుడు!" అన్నాడు ఆక్షేపించుతున్నట్లు.

వనమాల నొచ్చుకున్నది. "భగవానుడా! ఈ పూలు ఎంత త్వరగా వాడిపోతాయో మీకు తెలియనిదా? ఈ రోజున అవి తాజాగా ఉన్నాయంటే, రేపటికల్లా వాటి పని సరి. అయినా మీరు తెమ్మన్నారని అదే పూమాలను తెచ్చి మీకు సమర్పించాను. నన్ను క్షమించండి" అన్నది.

"అవును, నిజం" అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో. "సరిగా చెప్పావు నువ్వు. కానీ ఏ నియమం అయితే నువ్వు ఈ పూలకు వర్తిస్తుందని చెబుతున్నావో, అదే నియమం మన ఈ శరీరాలకు కూడా వర్తిస్తుంది! దీన్ని గుర్తుంచుకొని మనం మన అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవాలి- ఏమంటే మనకు ఉన్న సమయం చాలా తక్కువ. మేలుకో అమ్మాయీ! నీ శరీరాన్ని అమ్ముకోకు!"

బుద్ధుని బోధ స్పష్టంగా ఉండింది. సునిశితమైన ఆ మాటలు శరాఘాతాలై వనమాలను తగిలాయి.

ఆపైన వనమాల విటులను ఆకర్షించటం మానివేసింది. క్రమంగా తన జీవితాన్ని ధర్మమార్గంలోకి మలచుకున్నది. ప్రతిరోజూ సాయంత్రం బుద్ధుని బోధనలను వినేది.

వానాకాలం ముగిసి, బుద్ధుడు తన అనుయాయిలతో కలిసి వేరేచోటికి పయనమైనప్పుడు, వనమాల తన ఆస్తులు అన్నింటినీ త్యజించి, సన్యాసిని అయి, వారితోబాటు బయలుదేరింది.

అలా బుద్ధుని బృందంలోకి ఒక కొత్త భిక్షుణి చేరుకున్నది. కాలాంతరంలో ఆమె శుద్ధచేతస్కురాలై, తన జీవితాన్ని పావనం చేసుకున్నది.

(మూలం: పర్తాప్ అగర్వాల్, అప్రచురిత కథలు)

Wednesday, September 2, 2009

ఒంటి చేతి చప్పట్ల శబ్దం!

పర్తాప్ అగర్వాల్ గారు వారానికొకటి చొప్పున, అనేక సంవత్సరాలుగా తనకు గుర్తుకొచ్చిన కథలు రాస్తున్నారు-ఇంగ్లీషులో. ఉడతాభక్తిగా వాటిలో కొన్నింటిని తెలుగులోకి చేద్దామని ప్రయత్నం మొదలెట్టాను... ఆ క్రమంలో ఈ బ్లాగుకు మొదటి కథ ఇది:


జపాన్ లో బౌద్ధభిక్షువులు చాలామంది కాలినడకన దేశమంతటా తిరిగేవాళ్ళు. వాళ్ళకు సాయంగా ఉండేందుకని, దారిలో, ఎక్కడపడితే అక్కడ, జెన్ ఆరామాలు ఉండేవి. నడిచే భిక్షువులు ఎవరైనా, ఒకటి రెండు రోజులపాటు నడిస్తే, ఏదో ఒక ఆరామాన్ని తప్పక చేరుకోగలిగేవాళ్ళు. వాళ్ళకి అక్కడ ఉచితంగా వసతి, భోజనం వగైరా సదుపాయాలుండేవి.

అయితే ఈ ఆరామాల్లో ప్రవేశం అంత సులువుగా లభించేదికాదు. భిక్షువులలాగా వేషం వేసుకొని తిరిగే మోసకారులను గుర్తించి, త్రిప్పి పంపేందుకుగాను ఆరామాల్లో ప్రత్యేక పద్ధతులుండేవి. దీనికి కారణాలు రెండు: వనరులు పరిమితంగానే ఉండటం ఎలాగూ ఒక కారణం; అయితే సమయాన్ని వృధా చేసుకోవటం ఇష్టం లేకపోవటం ముఖ్యమైన అసలు కారణం.

ఇలా సందర్శకుల్ని త్రిప్పి పంపేసేందుకు వాడే విధానాల్లో ముఖ్యమైనది, "ప్రశ్నించటం". ప్రతి సందర్శకుడినీ ఒక ప్రత్యేకమైన ప్రశ్ననడుగుతారు. దానికి వాళ్లిచ్చే జవాబు అర్థవంతంగా లేకపోతే వారికి ఆ ఊళ్ళోని హోటళ్ల, సత్రాల చిరునామాలుండే పట్టికనిచ్చి మర్యాదగా సాగనంపుతారు.

ఒకసారి, సన్యాసి ఒకడు, రెండురోజుల నడకనీ ఒకే రోజున ముగించి, చాలా అలసిపోయి, విపరీతమైన ఆకలితో, సూర్యాస్తమయం అయిన తరువాత చాలాసేపటికి ఒక ఆరామాన్ని చేరుకొని తలుపు తట్టాడు. అప్పటికి బాగా చీకటి పడింది. బయట ఎముకలు కొరికేంత చలిగా ఉన్నది. ఆరామంలో చదువుకునే పిల్ల సన్యాసి ఒకడు, తలుపు రెక్కను కొద్దిగా తెరిచి, బయటికి తొంగి చూసి, మామూలుగా అడిగే ప్రశ్నల పరంపర మొదలుపెట్టాడు: "నువ్వెవరు? ఎక్కడినుండి వస్తున్నావు? ఎక్కడుంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు?..." ఇలా.

నడిచి వచ్చిన సన్యాసికి సంగతి అర్థమైంది. ప్రతి ప్రశ్నకూ అతను మర్యాదగా, జెన్ సన్యాసులకు సహజమైన స్పష్టతతో, సమాధానం ఇచ్చాడు. కానీ అప్పటికే అతను బాగా అలసిపోయి ఉన్నాడు; అతని ఓపిక వేగంగా తగ్గిపోతున్నది; "ఇక ఈ వెర్రి, కుర్ర సన్యాసి తన ప్రశ్నల జోరును ఆపి, తలుపు తెరిచి తనని లోనికి రమ్మంటే బాగుండును- తనకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, నిద్రముంచుకొస్తున్నది" అనుకుంటున్నాడు అతను.

ఆలోగా కుర్ర సన్యాసికి ఉదయం తన గురువుగారు తనని అడిగిన ప్రశ్న ఒకటి గుర్తుకొచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క తను ఉదయంనుండీ తంటాలు పడుతున్నాడు! అందుకని, అతను తమ సందర్శకుడిని పరీక్షించేందుకుగాను అదే ప్రశ్నని ఎంచుకున్నాడు- " ఒక చేత్తో కొట్టిన చప్పట్ల శబ్దం ఎలా ఉంటుందో నీకు తెలుసా?" అని.

బయట చలిలో నిలబడ్డ సన్యాసి ఓపిక ఆసరికి పూర్తిగా నశించింది. ఈ కుర్రవాడితో మరిన్ని ప్రశ్నలు అడిగించుకునే శక్తి లేదు అతనికి. అలాగని వీడితో సైద్ధాంతిక చర్చలో పాల్గొనే ఇష్టమూ లేదు! అందుకని, అతను మెరుపువేగంతో తన కాలి చెప్పును తీసి, ఆ చెప్పుతో కుర్ర సన్యాసి గూబ గుయ్ మనేట్లు ఒక్కటిచ్చాడు- "వినబడిందా? ఒంటి చేతి చప్పట్ల శబ్దం?" అంటూ.

కుర్ర సన్యాసి నిర్ఘాంతపోయాడు. అతనిలోని ప్రశ్నలన్నీ ఎండుకుపోయాయి. వెంటనే తలుపులు తెరిచి, అతను సందర్శకుడిని లోనికి రానిచ్చాడు.

భోజనం కానిచ్చిన సన్యాసి వెంటనే నిద్రపోయాడు.

మరునాడు ఉదయం అతను శలవు తీసుకుంటుండగా, కుర్ర సన్యాసి అడిగాడు వినమ్రంగా: "అయ్యా! నిన్న రాత్రి మీరు నాకు ఇచ్చిన ఒంటిచేతి చప్పట్ల శబ్దం నిజంగా ఒంటి చేతి చప్పట్ల శబ్దమేనంటారా?" అని.

"ఏమాత్రం సందేహ పడకు సోదరా, అది ఒంటి చేతి చప్పట్ల శబ్దం ఎంతమాత్రమూ కాదు. రోజంతా నడిచీ, నడిచీ అలసిపోయిన నేను, నీ ప్రశ్నల పరంపరకు తాళలేక, నిన్ను ఆపేందుకని, నీకు ఒక్కటిచ్చుకున్నాను- అంతే. అయితే, మరికొంత ఆలోచించినమీదట, నా చర్య నువ్వడిగిన శబ్దాన్ని ఉత్పత్తి చేసిందనే తోస్తున్నది నాకు. ఎందుకంటే, అది తక్షణమే కోరిన ఫలితాన్ని ఇచ్చింది గద! అంతేకాక, నా చర్య ఆలోచనా రహితంగా ఉత్పన్నమైన అసంకల్పిత చర్య. ఒంటిచేతి చప్పట్ల శబ్దం అలాంటి చర్యనుండే ఉత్పన్నం అవ్వాలి మరి!" అన్నాడు సన్యాసి, నవ్వుతూ.

(మూలం: పర్తాప్ అగర్వాల్, అప్రచురిత కథలు)