Wednesday, November 9, 2011

సంతోషం-దుఖం

దుఖమూ, సంతోషమూ మాట్లాడుకుంటూ కూర్చున్నై, నది ఒడ్డున.

నదిలో నీళ్లు పారుతుంటే రెండూ ఆ నీళ్లలో కాళ్ళు అల్లాడిస్తూ కూర్చున్నై.

కొన్ని నీటి కణాలు సంతోషపు పాదాలకు తగిలి నిండా సంతోషం‌ అయిపోయాయి.

మరికొన్ని నీటి కణాలు దు:ఖపు పాదాలకు తగిలి నిండా దు:ఖం అయిపోయాయి.

చాలా కణాలు, వీటి కాళ్ళకు తగలనివి, నిస్తేజంగా ప్రవహించినై.

అందుకనే, ప్రవాహంలోకి దిగి స్నానమాడే వాళ్ళు చాలామంది నిస్తేజంగా ఉండిపోతున్నారు.

దృష్టి కోణాలు

ఒక యీగ, తేనెటీగ కలుసుకున్నాయి పూలతోటలో.

"ఏమవ్వా, కులాసానా?" అడిగింది తేనెటీగ.

"ముసలిదాన్ని. నా కులాసాకు ఏమొచ్చింది గాని, మీరు పిల్లలు కులాసాగా ఉంటే అంతే చాలు" అన్నది ఈగ.

"ఈ పూలతోట ఎంత అందంగా ఉంటుందో, కద అవ్వా!?" అనంది తేనెటీగ.

"ఏమి అందంలే, ఎంత ఉన్నా పూలే కద!" అన్నది ఈగ.

"ఒక్కొక్క పువ్వులోంచీ యీ వసంతంలో వచ్చే సువాసన ఎంత మత్తెక్కిస్తుందో!" అన్నది తేనెటీగ, ఓ పువ్వు చుట్టూ తిరుగుతూ.

ఈగ ఏమీ మాట్లాడకుండా ఎగిరెళ్ళి అక్కడ పడి ఉన్న పేడకుప్ప మీద వాలింది- ఆశగా, తినేందుకు ఏమన్నా దొరుకుతుందేమోనని చూస్తూ.

Tuesday, October 11, 2011

పులివేంద్రాలు!

చాలా సంవత్సరాల క్రితం ఒక రాజుగారు ఉండేవారట.

ఆ రాజుగారికి పులులంటే చాలా ఇష్టమట.

చిన్న చిన్న పులి పిల్లలంటే మరీ ఇష్టమట. వేటకోసం అడవికి వెళ్ళినప్పుడల్లా ఒక బుజ్జి పులి పిల్లను ఇంటికి తెస్తూ ఉండేవాడట.

అట్లా ఆయన ఆస్థానంలో వందలాది పులులు తయారయ్యాయి.

'పులుల్ని ఊరికే బోనుల్లో‌బందీ చేసి ఉంచితే ఎలాగ?' అని వాటికోసమే ప్రత్యేకంగా ఒక అడవిని కేటాయిద్దామనుకున్నాడాయన.

అయితే వాళ్ల రాజ్యంలో ఏ అడవిని చూసినా అందులో ఏదో ఒక జాతి ప్రజలు నివస్తిస్తూనే ఉన్నారు. మరెలాగ? వాళ్ళు ఉండే అడవిని ఖాళీ చేసి పులులకు ఇచ్చెయ్యమంటే ఆ ప్రజలకు కష్టం కదా? అందుకని రాజుగారు ఒక సమావేశం ఏర్పాటు చేసి మంత్రుల్ని సలహా అడిగారు.

"దానిదేముంది ప్రభూ! క్రొత్తగా ఒక అడవిని తయారు చేస్తే సరి!" అన్నాడొక మంత్రి.

రాజుగారికి ఆ సలహా నచ్చింది. అడవిని పెంచితే పర్యావరణానికీ మేలు; గాలి కూడా బాగుపడుతుంది; పులులూ‌సంతోషంగా ఉంటాయి!
"సరే! అలాగే చేద్దాం! వీలైనంత త్వరగా అడవిని తయారు చేసెయ్యండి!" అన్నారు రాజుగారు.

అయితే అదికూడా సమస్యే అయ్యింది. "రాజ్యంలో అడవులు కాక మిగిలిన భూమి అంతా వ్యవసాయంలో ఉంది. వ్యవసాయం చేసేది ప్రజలే కదా! వాళ్లు ఆ భూముల్నే నమ్ముకొని బ్రతుకుతున్నారు. వాళ్ల భూముల్ని అడవిగా మార్చేస్తే ఇక వాళ్ళకెలాగ?"

అందుకని మంత్రులంతా అనుకున్నారు- "రాజ్యంలో ఎవ్వరూ సాగుచేయని భూమిని వెతుకుదాం. అందులో పులులకోసం అడవిని పెంచుదాం" అని.
అందరూ కలిసి వందలాది ఎకరాలున్న బంజరు భూమిని ఒకదాన్ని ఎంపిక చేశారు. అక్కడ చెట్లు నాటేందుకు గుంతలు త్రవ్వమన్నారు. త్రవ్వటం మొదలు పెట్టేసరికి, ఏమున్నది?! అక్కడ ఒకచోట బొగ్గు! ఒకచోట ఇనుము! ఒక్కోచోట బంగారం! వజ్రాలు! రాగి!- ఇంకా ఏవేవో విలువైన లోహాలు! వెంటనే మంత్రులు గనుల శాఖకు ఇచ్చేశారు, ఆ భూమిని.

కథ మళ్ళీ మొదటికి వచ్చింది. పులులకు భూమి కావాలి.

అప్పుడు రాజుగారికి గుర్తు వచ్చింది. "తన కోటలో చాలా స్థలం ఉంది కదా! వేల వేల ఎకరాల స్థలం అది. అందులో పులుల అడవిని తయారు చేసుకోవచ్చు కదా, బయట ఎందుకు?"

అయితే రాణిగారు అందుకు ఒప్పుకోలేదు. "నేను ఎప్పుడన్నా అట్లా బయట షికారుగా తిరగాలంటే ఈ పులులు అడ్డు వచ్చేస్తాయి బాబూ! ఇవి దగ్గర ఉంచటం కుదరదు!" అన్నది.

అంతలో ప్రజల్లోనే కొందరు తుంటరివాళ్ళు బయలుదేరారు- "అసలు పులుల్ని పెంచుకోవటం ఎందుకు? ఏమైనా ప్రమాదం జరిగితే అందరికీ శ్రమ కదా?! అప్పుడు ఏడ్చుకునే బదులు, ఇప్పుడే ఆ పులుల్ని, అవి మరీ ఎక్కువ కాకమునుపే, మామూలు అడవుల్లో నిశ్శబ్దంగా వదిలేస్తేనేమి?" అని.

రాజుగారు కొంచెం ఆలోచించి, వాటిని అన్నిటినీ రాజ్యంలో వేరు వేరు చోట్ల వదిలిపెట్టించారు. ఎక్కడికక్కడ, చిన్న చిన్న పులివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఎవ్వరూ ఏమీ అనలేదు. అందరూ అభివృద్ధి జరుగుతున్నదని మిన్నకుండిపోయారు. దాన్ని చూసి, ప్రపంచంలోని రాజులందరూ అటుపైన అదేపని చెయ్యటం మొదలు పెట్టారు!

మనం పెంచి పోషించుకుంటున్న పులులు- ఇట్లాంటివి చాలానే ఉన్నట్లున్నాయి. కాలుష్యాన్ని పెంచే కర్మాగారపు పులులు ఒకప్పటి మాటైతే, అణుకేంద్రపు పులులు, అవినీతి పులులు ఇప్పటివి. చిన్న చిన్న పులివేంద్రాలుగా ఇప్పుడు ఇవి ప్రపంచమంతటా పరచుకొని ఉన్నాయి, చప్పుడు చేయకుండా.
ఏ సునామీలో వచ్చినప్పుడు అక్కడ గర్జనలు వినబడుతుంటాయి- అయితే సామ్రాజ్యాల గోడల్ని దాటి బయటికి వచ్చేసరికి, ఆ అరుపులే మనకు పిల్లికూతలుగా వినబడుతుంటాయి.

వేరే వాటి సంగతి ఎలాగున్నా, ముందు ఈ పులివేంద్రాలకు ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుండు.

Wednesday, September 7, 2011

ఉద్యమం

చాలా సంవత్సరాల క్రితం ఒక గురుకుల పాఠశాల.
ఆ బడిలో పిల్లలందరూ నిజంగా ఆణిముత్యాలు. ఐదో తరగతిలోనూ, ఏడో తరగతిలోనూ అద్భుత ప్రతిభ కనబరచిన పిల్లలు. ప్రభుత్వం ఇలాంటి గొప్ప బడులను వాళ్లకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పిల్లలకోసం చాలా వసతుల్ని కల్పించింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు వాళ్లకు మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పేవాళ్లు.
అక్కడ పని చేసే తెలుగు అయ్యవార్లకు తెలుగంటే నిజంగా ప్రేమ ఉండేది.
సైన్సు టీచరుగారికి నిజంగా విజ్ఞాన శాస్త్రం అంటే అభిమానమూ, శాస్త్రీయ దృక్పథమూ ఉండేవి.
సాంఘిక శాస్త్రపు అయ్యవారికి సమాజం గురించి తనదైన అవగాహన ఒకటి ఉండేది.
హెడ్మాస్టారు గారికి పిల్లలంటే అభిమానమూ, తన బాధ్యతపట్ల నిబద్ధతా ఉండేవి.
అయితేనేమి, ఒకసారి పిల్లలు తినే అన్నంలో పురుగులు కనబడ్డాయి.
చురుకైన పిల్లలు ఆ విషయాన్ని వెంటనే టీచర్ల దృష్టికి తెచ్చారు. టీచర్లు హెడ్మాస్టరుగారికి చెప్పారు.
మరునాడూ పురుగులు కనబడ్డాయి.
పిల్లలకు గొప్ప సామాజిక స్పృహ అలవడింది ఆ సరికి. పురుగుల్ని చూసిన కొందరు పిల్లలకు చాలా కోపం వచ్చేసింది. మిగతావాళ్లను కూడగట్టుకున్నారు. హెడ్మాస్టరుగారిని నిలదీద్దామని వెళ్ళారు.
రోజూ పిల్లలు, టీచర్లు అందరూ కలిసి భోంచేస్తుంటారు బడిలో. ఆరోజున, పాపం, ఆయన తన గదికే అన్నం తెప్పించుకొని తింటున్నారు.
తెలివైన పిల్ల నేతల మెదళ్లు చకచకా పనిచేశాయి- "మాకేమో పురుగుల అన్నం, మీకేమో ప్రత్యేక భోజనమా?" అని. పాపం, హెడ్మాస్టరుగారు తింటున్నది ప్రత్యేక భోజనమేమీకాదు, నిజానికి. పనిలో పడి, సమయానికి భోజనశాలకు రాలేక, అక్కడికే తెప్పించుకున్నారు, ఆ రోజుకు.
అంతే- పిల్లల నిరసన మొదలయిపోయింది. తరగతుల్ని బహిష్కరించేశారు. పిల్లలందరూ చెట్ల క్రిందికి చేరారు. పిల్ల నాయకులు గట్టిగా మాట్లాడారు. "ఈ దోపిడిని, అన్యాయాన్ని ఉపేక్షించకూడదు" అన్నారు. పిల్లలందరూ ఒక్కటై తలలూపారు. టీచర్లు ఏం చెప్పినా, హెడ్మాస్టరుగారు ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మని పరిస్థితి. సభలు, సమావేశాలు- ఎక్కడ చూసినా గందరగోళం- వేరువేరు కూటములు- అందరూ ఎక్కడెక్కడ ఏ ఏ అన్యాయాలు జరుగుతున్నాయో ఉన్నవాటినీ, లేనివాటినీ ఎత్తిపోశారు.
"ఇలాంటి పిల్లలకు మేం పాఠాలు చెప్పలేం" అన్నారు టీచర్లు. "నేనిక్కడ ఉండలేను" అని నొచ్చుకున్నారు హెడ్మాస్టరుగారు. చివరికి బడి మూసేశారు- పదిహేను రోజులు శలవలు ప్రకటించారు.
పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బడి తెరిచారు- ఈసారి కొత్త హెడ్మాస్టరుగారు, కొత్త టీచర్లు వచ్చారు.
పిల్లలు కొందరు ఒకింత ఉత్సాహపడ్డారు- "విద్యార్థి ఐక్యతతో ఏదైనా సాధించవచ్చు" అని చెప్పుకున్నారు పైకి.
కానీ పిల్లలవి నిజంగా సున్నిత హృదయాలు. "మేం హెడ్మాస్టరుగారిపైనా, ఉపాధ్యాయులపైనా చేసిన ఆరోపణల్లో పూర్తి నిజం లేదు. నిరసనైతే ప్రకటించాం, కానీ మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి మనసుల్ని మాత్రం చాలా గాయపరచాం" అని వాళ్ళు గుర్తించారు. అయినా గాయపడిన పెద్దల మనసుల్ని ఎలా చక్కదిద్దాలో తెలీక, వాళ్ళూ నొచ్చుకొని ఊరుకున్నారు!

అన్యాయాన్ని నిరసించాలి. అయితే ఆ క్రమంలో సత్యాన్ని వక్రీకరించనక్కర్లేదు. అసత్యాన్ని ప్రోత్సహించకూడదు. సూటిగా, నిజాన్ని మాత్రమే వ్యక్తీకరించటం అవసరం. ఇది ఈనాటి రాజకీయాలకే కాదు; అన్ని సామాజిక ఉద్యమాలకూ చాలా అవసరం- ఏమంటారు?